వ్యవసాయ పొలంలో వరి కొయ్యలు కాల్చిన 8 మంది రైతులకు రూ.5వేల చొప్పున జరిమానా : జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని రాజారాం తండా గ్రామంలో వరి కొయ్యలను కాల్చిన ఎనిమిది మంది రైతులపై ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు గ్రామ పంచాయతీ సమక్షంలో జరిమానా విధించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో తెలిపారు.
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో వరి కొయ్యలు మరియు పంట అవశేషాలను కాల్చరాదని పలుమార్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా, గ్రామ పంచాయతీ ద్వారా కూడా వరి కొయ్యలు కాల్చకూడదని తీర్మానం చేయబడింది. అలాగే, వరి కొయ్యలు కాల్చినట్లయితే ప్రభుత్వ ఉత్తర్వులు (GO Ms. No. 27) ప్రకారం జరిమానాలు మరియు ఇతర చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని రైతులకు ముందస్తుగా తెలియజేయబడింది.
అయినప్పటికీ, రాజారాం తండా గ్రామానికి చెందిన శ్రీ భూక్యా నంద్యా నాయక్, లకవత్ రాములు, లకవత్ భక్సయ్య, భూక్యా సంతోష్,కున్సోత్ రాజేష్,దేగావాత్ రాజు, లకవత్ తిరుపతి మరియు భానోత్ రాజు తమ వ్యవసాయ క్షేత్రాలలో వరి కొయ్యలను కాల్చినట్లు గుర్తించబడింది. దీనిపై మండల వ్యవసాయ అధికారి, కథలాపూర్ గారు, గ్రామ సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శి సమక్షంలో విచారణ నిర్వహించి, పర్యావరణ, అటవీ, విజ్ఞాన శాస్త్ర & సాంకేతిక శాఖ జారీ చేసిన జి.ఓ. ఎం.ఎస్. నం.27 నిబంధనల ప్రకారం ఒక్కొక్కరికి రూ.5,000 చొప్పున జరిమానా విధించారు.
రైతులందరూ పంట అవశేషాలను కాల్చకుండా శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించి, నేల సారాన్ని కాపాడడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని జిల్లా వ్యవసాయ అధికారి కోరారు. భవిష్యత్తులో కూడా వరి కొయ్యలు లేదా ఇతర పంట అవశేషాలను కాల్చిన వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.




