Arrive Alive, A Campaign for Safer Roads in Telangana” కార్యక్రమంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం
జగిత్యాల జిల్లా…
అతివేగం, ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం వల్లనే రోడ్డు ప్రమాదాలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
👉 డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి
👉 పోలీస్ కళాబృందం ద్వారా ట్రాఫిక్ నియమాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం
రోడ్డు ప్రమాదాలను నియంత్రించి, ప్రతి పౌరుడు సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలనే లక్ష్యంతో తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “Arrive Alive – A Campaign for Safer Roads in Telangana” కార్యక్రమంలో భాగంగా గురువారం జగిత్యాల పట్టణంలోని ఓల్డ్ బస్ స్టాండ్ వద్ద రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ రఘు చందర్, మున్సిపల్ చైర్మన్ సమీండ్ల వాణి శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు సుధాకర్, కరుణాకర్, ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 300 మంది విద్యార్థులు, ప్రజలు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొని రోడ్డు భద్రతపై అవగాహన పొందారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో ఇతర ప్రమాదాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు జిల్లా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలతో పాటు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రజల్లో డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించడం ముఖ్య లక్ష్యమని స్పష్టం చేశారు.
రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, మొబైల్ ఫోన్ వినియోగం, ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం వంటి కారణాల వల్లనే జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనం నడిపి, తమతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో భాగంగా పోలీస్ కళాబృందం సభ్యులు పాటలు, నాటికల ద్వారా ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను ప్రజలకు సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపకూడదనే నిబంధనలు, అతివేగం వల్ల కలిగే ప్రమాదాలు వంటి అంశాలను ప్రభావవంతంగా ప్రజలకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది యమధర్మరాజు మరియు చిత్రగుప్తుడు వేషధారణలో ప్రదర్శించిన నాటిక. ఈ నాటికలో రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల జీవితాలను ప్రతిబింబిస్తూ, వారి నిర్లక్ష్యం ఎలా ప్రాణాంతక పరిణామాలకు దారితీసిందో హృద్యంగా చూపించారు. యమధర్మరాజు, చిత్రగుప్తుడు పాత్రల ద్వారా ప్రతి మనిషి తన చర్యలకు తానే బాధ్యత వహించాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తూ, చిన్న పొరపాటు కూడా ఎంతటి పెద్ద నష్టానికి కారణమవుతుందో సందేశాత్మకంగా తెలియజేశారు.
వినోదంతో పాటు విలువైన సందేశాన్ని అందించిన ఈ ప్రదర్శన అక్కడున్న విద్యార్థులు, ప్రజలను విశేషంగా ఆకట్టుకుని, రోడ్డు భద్రతపై లోతైన ఆలోచన కలిగించింది. ముఖ్యంగా యువతలో ట్రాఫిక్ నియమాల పట్ల బాధ్యతాభావం పెంపొందించడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషించింది.
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.





