వైభవంగా,వేదోక్తంగా శ్రీ ఉగ్ర నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ, శంఖుస్థాపన
👉🏾 పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి లక్ష్మణ్ కుమార్, దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు
👉 రూ.200 కోట్లతో దివ్యక్షేత్ర అభివృద్ధి – భక్తులకు మరింత మెరుగైన వసతులు

జగిత్యాల జిల్లా, ధర్మపురి క్షేత్రం :
శ్రీ ఉగ్ర నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజా కార్యక్రమం నిర్ణీత ముహూర్త సమయంలో వేద పండితుల వైదిక క్రతువు, వేదమంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు.

శతాబ్దాల చరిత్ర, విశిష్ట ఆధ్యాత్మిక ప్రాశస్త్యం కలిగిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో శ్రీ ఉగ్ర నరసింహ స్వామి దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేసి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ఆలయ పునర్నిర్మాణ పనులకు సోమవారం తెల్లవారుజామున 2గంటల 48 నిమిషాలకు శుభ ముహూర్తాన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, విద్యుత్ శాఖ సీఎండి వరుణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ తో కలిసి ఘనంగా భూమి పూజా కార్యక్రమం నిర్వహించారు.

రాష్ట్ర ప్రభుత్వం దివ్యక్షేత్రాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, ఈ ఆలయ పునర్నిర్మాణం కోసం దాదాపు రూ.200 కోట్లను కేటాయించింది.

ధర్మపురి శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవతో దేవాదాయ శాఖ కమిషనర్ మంత్రిప్రగడ హనుమంతరావు పర్యవేక్షణలో నిర్వహించిన భూమిపూజ కార్యక్రమం అనంతరం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ…స్వామివారి భూమిపూజ కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టమన్నారు.

తెలంగాణలోని చారిత్రక, ఆధ్యాత్మిక క్షేత్రాలను అభివృద్ధి చేసి వాటి వైభవాన్ని పునరుద్ధరించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
భక్తుల విశ్వాసానికి అనుగుణంగా ఆలయాల అభివృద్ధితో పాటు మౌలిక వసతులను మెరుగుపరుస్తామని తెలిపారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ పునర్నిర్మాణానికి రూ.200 కోట్లను కేటాయించడం ద్వారా ఈ క్షేత్ర అభివృద్ధికి ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకుందని పేర్కొన్నారు.
రాబోయే *గోదావరి పుష్కరాలను* పురస్కరించుకుని బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రముఖ ఆలయాలు, ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే *రూ.1,000 కోట్లను కేటాయించిందని* తెలిపారు.

భక్తులు, యాత్రికులకు సౌకర్యవంతమైన, ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించేలా అభివృద్ధి పనులను చేపడుతున్నామని వెల్లడించారు.
👉 రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ….శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ పునర్నిర్మాణం ఈ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష అని అన్నారు.

స్థానిక ప్రజల అభ్యర్థన, భక్తుల ఆకాంక్షలను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లగా, ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, ఆలయ అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేసిందని తెలిపారు.
ఆలయ పునర్నిర్మాణం పూర్తయిన అనంతరం భక్తులకు మరింత మెరుగైన దర్శన సౌకర్యాలు, అవసరమైన మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయని మంత్రి పేర్కొన్నారు. ఈ దివ్యక్షేత్రాన్ని తెలంగాణలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని తెలిపారు.

👉 దేవాదాయ శాఖ కమిషనర్ మంత్రిప్రగడ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ….ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో ఆలయ పునర్నిర్మాణ పనులను ప్రణాళికాబద్ధంగా, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపడతామని తెలిపారు. నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్, అర్చకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.





